కోల్కతా: ఈ విషయం తెలిసి తాను చాలా షాకయ్యానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె ఆదివారం ఒక లేఖ రాశారు. రిపబ్లిక్ డే పరేడ్లో బెంగాల్ శకటాన్ని నిరాకరించడంపై మమత మండిపడ్డారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నేతాజీతోపాటు ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీని స్మరించుకునేలా శకటాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది. రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానంద, విద్యాసాగర్, చిత్తరంజన్ దాస్, శ్రీ అరబిందో, మాతంగిని హజ్రా, బిర్సా ముండా, నజ్రుల్ ఇస్లాం వంటి వారి చిత్రాలను కూడా ఇందులో ఉంచింది.
అయితే పశ్చిమ బెంగాల్తోపాటు పలు రాష్ట్రాల శకటాలను కేంద్రం తిరస్కరించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. ఈ విషయం తెలిసి సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వైఖరికి బెంగాల్ ప్రజలు చాలా బాధపడ్డారంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎటువంటి కారణాలు లేదా సమర్థనలు ఇవ్వకుండా రాష్ట్ర శకటాన్ని తిరస్కరించడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఈ నిర్ణయంతో తాను చాలా బాధపడ్డానని, షాక్ అయ్యానంటూ అందులో పేర్కొన్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో బెంగాల్ ముందంజలో ఉందని మమత అన్నారు. విభజన ద్వారా దేశానికి స్వాతంత్ర్యం కోసం భారీ మూల్యం చెల్లించిందని గుర్తు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేపథ్యంగా రూపొందించిన రాష్ట్ర శకటం ప్రదర్శన రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రధాని మోదీని లేఖలో కోరారు.
మరోవైపు సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురు, జటాయు పార్క్ స్మారక చిహ్నంపై కేరళ ప్రభుత్వం ప్రతిపాదించిన శకటాన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. ఆదిశంకరాచార్యపై శకటాన్ని రూపొందించాలని కేంద్రం కోరగా, కేరళ మాత్రం శ్రీనారాయణ గురు థీమ్పై పట్టుబట్టింది.