Cash for Query Scam | తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ మహువా మొయిత్రా కష్టాలు పెరుగుతున్నాయి. పార్లమెంట్లో ప్రశ్నలకు డబ్బులు వ్యవహారంలో లోక్పాల్ ఫిర్యాదు మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. మహువా మొయిత్రాపై బీజేపీ నేత నిషికాంద్ దూబే లోక్పాల్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు బదులుగా టీఎంసీ డబ్బులు తీసుకున్నట్లు నిషికాంత్ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే.
ఆర్థిక ప్రయోజనాల కోసం దేశభద్రతతో ఆడుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై లోక్సభ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహువాను విచారించింది. ప్రస్తుతం సీబీఐ రంగంలోకి దిగి ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో ధ్రువీకరించడంతో పాటు ఆరోపణలపై పూర్తి విచారణ చేపట్టేందుకు అర్హత ఉందా? లేదా? తేలనున్నది.
ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లభిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ప్రధాని మోదీ, అదానీ గ్రూప్పై ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో నిషికాంత్ దూబే ఆరోపించారు. అలాగే, పార్లమెంట్ లాగిన్ వివరాలను సైతం ఇతరులతో పంచుకున్నారన్నారు. లాగిన్, పాస్వర్డ్ షేరింగ్పై ఎలాంటి నియంత్రణలేదని టీఎంసీ ఎంపీ మొయిత్రా పేర్కొన్నారు.