Acharya @ Rajastan CM | త్వరలో రాజస్థాన్కు కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. గత కొంతకాలంగా మార్పు జరుగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో.. ప్రియాంక గాంధీకి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం ఈ పని త్వరలోనే పూర్తికానున్నదని సంకేతాలిచ్చారు. రాజస్థాన్లో సీఎం పీఠంపై నుంచి అశోక్ గెహ్లాట్ను తప్పిస్తున్నట్లు సైగలు చేశారు. రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నదని ఆయన చెప్పారు. తీర్పును ఇప్పటికే రాశారని, దాన్ని ప్రకటించడమే మిగిలి ఉన్నదన్నారు. రాజస్థాన్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంటున్నదని తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి కాంగ్రెస్కు చెందిన ప్రతి ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని చెప్పారు.
ఆచార్య ప్రమోద్ కృష్ణం శనివారం ఉదయం సివిల్ లైన్స్లోని ప్రభుత్వ బంగ్లాలో అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషితో భేటీ అయ్యారు. వీరి భేటీ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. భేటీ అనంతరం ఆచార్య ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నదని, దీని సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్, సీపీ జోషి సహా ఎమ్మెల్యేలంతా అండగా నిలుస్తారని అన్నారు. రాజస్థాన్లో ఏం జరిగినా, ఏం జరుగుతున్నా అది కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఉంటుందన్నారు. రాజస్థాన్ వీలైనంత త్వరగా సరైన మార్గాన్ని చూడనున్నదని అభిప్రాయపడ్డారు.