న్యూఢిల్లీ: హర్యానాలో అయిదు ఎకరాల స్థలం కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన కేసులో ఈడీ విచారణ చేస్తున్నది. అయితే ఆ కేసుకు చెందిన ఛార్జిషీట్లో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi Vadra) పేరును ఈడీ చేర్చింది. ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వద్రా పేరు కూడా ఆ ఛార్జిషీట్లో ఉంది. కానీ ఇద్దర్నీ మాత్రం నిందితులు జాబితాలో చేర్చలేదు. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ థంపి, బ్రిటీష్ ఎన్ఆర్ఐ సుమిత్ చద్దాలపై ఈడీ తన ఛార్జిషీట్ను దాఖలు చేసింది. ఆయుధ డీలర్ సంజయ్ భండారికి ఆ ఇద్దరూ హెల్ప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహవాతో జరిగిన లావాదేవీల గురించి ప్రియాంకా గాంధీపై అనుమానాలు ఉన్నాయి. ఫరీదాబాద్లో ప్రియాంకా గాంధీ పేరుతో 2006లో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ ఇంటిని పహవాకు అమ్మేశారు. పహవా నుంచే అదే గ్రామంలో థంపి సుమారు 486 ఎకరాల భూమిని అమిపుర్లో కొనుగోలు చేశారు. ఆ గ్రామంలోనే ప్రియాంకా కూడా 40 ఎకరాలు కొన్నది. ఆ తర్వాత 2010లో ఆ స్థలాన్ని మళ్లీ పహవాకే అమ్మేసింది. రాబర్ట్ వద్రా, థంపికి సంబంధాలు ఉన్నట్లు గత ఛార్జిషీట్లలో ఆరోపించారు.