బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో (Karnataka Assembly Elections) ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ ఎల్లప్పుడూ మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ బీజేపీకి ఓటు వేయాలని కోరతారని ఆమె ఎద్దేవా చేశారు. విపక్షాలు తనను ఎన్నిసార్లు తిట్టాయనేది లెక్కించడమే ప్రధాని మోదీ పనిగా పెట్టుకుంటారని, దేశాన్ని కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారని కాషాయ నేతలు చెబుతుంటారని అన్నారు.
కొప్పల్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ మాట్లాడారు. మతం గురించి మాట్లాడే బీజేపీ నేతలు వారు చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరని చురకలు వేశారు. ప్రజలు మహాభారతంలో అర్జునుడిలా దృష్టి సారించి ప్రజా సమస్యలు, అంశాల ప్రాతిపదికనే ఓటు వేయాలని ఆమె కోరారు.
అర్జునుడి కన్ను లక్ష్యంపైనే గురిపెట్టి ఉంటుందని, ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించడంపైనే కేంద్రీకరిస్తాడని చెబుతూ కర్నాటక ప్రజలు సైతం అర్జునుల్లా ఏకాగ్రతతో తమ భవిష్యత్పై దృష్టి సారించాలని పిలుపు ఇచ్చారు. తమను పక్కదారి పట్టించే ప్రసంగాలతో దారి మళ్లకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జమ్ఖండిలో జరిగిన ర్యాలీలో సైతం ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రధాని మోదీని ఆమె ఏడిచే పిల్లవాడితో పోల్చారు.
Read More
Marriage in Mosque | మసీదులో హిందూ జంట పెళ్లి.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన వధూవరులు