అలప్పుజ: కేరళ రాష్ట్రంలో ఓ హిందూ జంట వివాహం గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్లో ఎక్కువగా ఆ పెళ్లి గురించే చర్చ జరుగుతున్నది. దేశంలో నిత్యం ఎన్నో పెళ్లిళ్లు జరుగుతుంటాయి, అలాంటప్పుడు ఈ హిందూ జంట పెళ్లిలో మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటనేగా మీ అనుమానం..? అవును ఈ పెళ్లికి ప్రత్యేక ఉన్నది. ఆ ప్రత్యేకత ఏమింటే.. ఈ హిందూ జంట పెళ్లి ఇంటి ముందో, ఫంక్షన్ హాల్లోనో, గుడిలోనో జరుగలేదు. ఏకంగా ఓ మసీదులో జరిగింది. అదే ఈ పెళ్లి ప్రత్యేకత.
అలప్పుజలోని చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు ఈ హిందూ జంట పెళ్లికి వేదికైంది. పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారం పండితుల వేదమంత్రాలు, బాజాభజంత్రీల నడుమ వధువు అంజూ, వరుడు శరత్ల పెళ్లి జరిగింది. నిర్వాహకులు తమ మసీదులో హిందూ జంటకు పెళ్లి చేయడమే కాదు, వధువుకు 10 తులాల బంగారం, దంపతులకు రూ.20 లక్షల ఆర్థిక సాయం కూడా చేశారు. అంతేగాక వధూవరుల బంధుమిత్రులు 1000 మందికి భోజనాలు పెట్టించారు. దాంతో ఆ మసీదులో మతసామరస్యం వెళ్లివిరిసింది.
అయితే, వధువు కుటుంబం నిరుపేదరికమే మసీదులో ఈ పెళ్లి జరగడానికి కారణమైంది. వధువు అంజూ తల్లి తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తన కుమార్తెకు పెళ్లికి సాయం చేయాలని స్థానిక మసీదు నిర్వాహకులను కోరింది. దాంతో వారు తమ మసీదులోనే వారి పెళ్లి జరిపించి, జంటకు ఆర్థిక సాయం కూడా చేశారు. దీనిద్వారా ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఎదుటి వ్యక్తిని ప్రేమగా చూడాలనే సందేశాన్ని ఇచ్చారు. 2020లో జరిగిన ఈ పెళ్లి వీడియో గత కొన్ని వారాలుగా మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..