UP Polls : యూపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెల్లడవడంతో రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు, ఆరోపణలకు పదును పెడుతున్నాయి. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. తాను యూపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో బ్రాహ్మణులు, దళితులపై వేధింపులు, దాడులు తీవ్రతరమయ్యాయని ఆరోపించారు.
బ్రాహ్మణులు, దళితులకు యోగి సర్కార్ చేసిందేమీలేదని మండిపడ్డారు. కాషాయ పార్టీ ఆగడాలను ప్రజలు అర్ధం చేసుకున్నారని వారు అమాయకులు కాదని అన్నారు. రాహుల్ గాంధీతో పాటు తనను బీజేపీ నేతలు యాధృచ్చిక నేతలుగా చెబుతున్నారని, రాహుల్ గాంధీ సీరియస్ రాజకీయ నేత కాకుంటే ఆయన గురించి యోగి పలమార్లు ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె నిలదీశారు. తన సోదరుడు 15 ఏండ్లకు పైగా రాజకీయాల్లో నిమగ్నమయ్యారని ప్రియాంక చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో ప్రజలకు సంబంధించిన అంశాలను లేవనెత్తడం పట్ల తమ పార్టీకి విశ్వాసం ఉందని అన్నారు. మతం, కులం ఇవాళ రాజకీయాల్లో ముందుకొచ్చాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం వంటి వాస్తవిక అంశాలను ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరం రాజకీయ పార్టీల ముందుందని అన్నారు. యోగి సర్కార్ మహిళలను విస్మరిస్తోందని వారికి మరుగుదొడ్లు, ఎల్పీజీ కనెక్షన్లను అందించి చేతులు దులుపుకుంటోందని వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు.