న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం స్పందించారు. కేంద్రం ప్రజల ఇబ్బందులకు చలించి మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకోలేదని కేవలం భయంతోనే ఇలా చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.
రాబోయే ఎన్నికల్లో ఈ వసూళ్ల సర్కార్ లూటీకి దీటుగా బదులివ్వాలని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం హృదయంతో తీసుకున్నది కాదని..భయంతోనే కేంద్రం పెట్రో భారాలను తగ్గించేందుకు మొగ్గుచూపిందని ప్రియాంక పేర్కొన్నారు. కాగా కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలను మరింత తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కోరారు.