లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిని తానేనని సంకేతాలు పంపిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. యూపీలో పార్టీ సీఎం అభ్యర్ధిని తానేనని తాను చెప్పలేదని ప్రియాంక శనివారం స్పష్టం చేశారు. తనను మీడియా ప్రతినిధులు పదేపదే అదే ప్రశ్న అడుగుతుండటంతో చికాకు వల్లే అలా చెప్పానని ఆమె పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం యూత్ మేనిఫెస్టో ప్రకటించిన సమయంలో పార్టీ సీఎం అభ్యర్ధి ఎవరని మీడియా ప్రశ్నించగా ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
యూపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరో ముఖాన్ని ఎవరైనా మీరు చూశారా..మీరు ఎక్కడైనా నా ముఖాన్నే చూస్తున్నారు కదా అని ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రియాంక వ్యాఖ్యలతో యూపీ సీఎం ఆమేనని కధనాలు వెల్లువెత్తాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యానాద్ చేసిన 80 శాతం వర్సెస్ 20 శాతం వ్యాఖ్యలనూ ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. యూపీలో వాస్తవ స్ధితి 99 శాతం వర్సెస్ 1 శాతంగా ఉందని ఎద్దేవా చేశారు.
కాషాయ పార్టీ హయాంలో సర్కార్కు అనుయాయులుగా ఉన్న కొద్దిమంది పారిశ్రామికవేత్తలు మినహా మిగిలిన ప్రజలంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలో మగ్గుతున్న నిరుద్యోగ యువత గురించి పాలకులు ఎందుకు మాట్లాడటం లేదని ఆమె నిలదీశారు. విద్యపై యోగి సర్కార్ వెచ్చిస్తున్న నిధుల గురించి ఎందుకు చర్చించరని అన్నారు. యూపీ ఎన్నికలకు ముందు బీఎస్పీ అధినేత్రి మాయావతి మౌనం దాల్చడాన్ని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు, ఇక ఫిబ్రవరి పది నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.