లక్నో : మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. యూపీలో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆమె బుధవారం ప్రకటించారు. మహిళలు రాజకీయాల్లో పాలుపంచుకుంటే మహిళా సాధికారత కేవలం కాగితాలకే పరిమితకం కాకుండా సాకారం అవుతుందని అన్నారు.
కాంగ్రెస్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిని అందించిందని అన్నారు. దేశంలో తొలి మహిళా సీఎంగా కాంగ్రెస్కు చెందిన సుచేత కృపలానీ అధికార పగ్గాలు చేపట్టారని ఆమె గుర్తుచేశారు. యూపీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రియాంక ఇటీవల పలు వర్గాలపై ఎన్నికల హామీలు గుప్పించారు. హామీలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని వెల్లడించారు.
వరి, గోధుమలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. యూపీలో యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రియాంక యువతకు హామీ ఇచ్చారు. విద్యార్ధినులకు ఉచిత ఇ-స్కూటీ, మొబైల్ ఫోన్లు ఇస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.