లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల పోరులో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. యోగి సర్కార్పై ఓవైపు అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), మాయావతి నేతృత్వంలోని మాయావతి అస్త్రశస్త్రాలతో విరుచుకుపడుతుండగా ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో అద్భుతాలు సృష్టిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక యూపీ కదనరంగంలోకి కాలుమోపిన ప్రియాంక గాంధీ ప్రధానంగా రాష్ట్రంలో కలకలం రేపిన నాలుగు ఘటనలను ప్రచారాస్త్రాలుగా మలుచుకోనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటనలో రైతుల మరణం అంశంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించారు. లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసనగా ప్రియాంక ముందుండి నడిపించిన ఆందోళనలకు భారీ ప్రచారం లభించడం పార్టీ శ్రేణుల్లో ఆమె నాయకత్వం పట్ల సరికొత్త ఆశలు రేకెత్తించాయి.
2020లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన హత్రాస్ హత్యాచార ఘటన దేశాన్ని కుదిపివేయగా యోగి సర్కార్ హయాంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని ఈ ఘటనను ఉద్దేశించి యూపీ సర్కార్ను ప్రియాంక లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ఇక సోన్భద్ర జిల్లాలో గ్రామ పెద్ద అనుచరులు 2019లో గిరిజన రైతులపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు సహా పది మంది మరణించిన ఘటననూ ప్రస్తావిస్తూ శాంతిభద్రతల విషయంలో యోగి సర్కార్ వైఫల్యాలను ప్రియాంక ఎండగడుతున్నారు.
మరోవైపు ఉన్నావ్లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ 2017లో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 2020లో జీవిత ఖైదు పడటంతో యోగి సర్కార్ డిఫెన్స్లో పడింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రియాంక గాంధీ బీజేపీ సర్కార్ను లక్ష్యంగా చేసుకుని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించాయి. ఇదే ప్రాంతంలో 2018లో ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి సజీవ దహనం చేసిన ఘటనా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉన్నావ్లో జరిగిన ఈ రెండు ఘటనలను యోగి సర్కార్ను ఎండగట్టేందుకు ప్రియాంక గాంధీ మరోసారి తెరపైకి తీసుకురానుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.