న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ టీకాల కొరతకు కేంద్రమే కారణం అని ఆమె నిప్పులు చెరిగారు. ప్రణాళిక లేమి వల్లే రెమ్డెసివిర్, ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్నారు. గత 3 నెలల్లో భారత్ నుంచి 6 కోట్ల కొవిడ్ టీకాలు ఎగుమతి చేశారని తెలిపారు. జనవరి – మార్చి మధ్య భారత్లో 3 -4 కోట్ల మందికే టీకాలు వేశారన్నారు. గత 6 నెలల్లో 1.1 మిలియన్ల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఎగుమతి చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రపంచంలోనే భారత్ది అగ్రస్థానం అయినప్పటికీ, కొరత ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళిక లోపమే అన్నింటికీ కారణమని ధ్వజమెత్తారు.
కరోనా బారిన పడ్డ ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆక్సిజన్, బెడ్లు, మెడిసిన్స్ కోసం రోగులు ఎదురుచూస్తుంటే.. అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం ఎన్నికల ర్యాలీల్లో బిజీగా గడుపుతున్నారు. ప్రజలు ఏడుస్తుంటే.. వారు మాత్రం ర్యాలీలో నవ్వుతూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో జోకులు, నవ్వులు ఆపి కరోనాతో పోరాడుతున్న ప్రజల వద్దకు మోదీ రావాలి. వారి బాధలు పట్టించుకోవాలి. ఏ విధంగా వారిని వైరస్ నుంచి కాపాడాలనే విషయంపై మోదీ ఆలోచిస్తే బాగుంటుంది అని ఆమె అన్నారు.
ఈ బీజేపీ ప్రభుత్వం దుబాయ్లో ఉన్న ఐఎస్ఐతో మాట్లాడగలదు. కానీ దేశంలోని ప్రతిపక్ష నాయకులతో ఎందుకు మాట్లాడరు? మన్మోహన్ సింగ్ పదేండ్లు ప్రధానిగా సేవలందించారు. అతను గౌరవప్రదమైన వ్యక్తి అని అందరికీ తెలుసు. దేశం మహమ్మారిని ఎదుర్కొంటున్నప్పుడు అతను సలహాలు ఇస్తుంటే, వారు అదే గౌరవంతో సలహాలను తీసుకోవాలి అని ప్రియాంక గాంధీ అన్నారు.