ముంబై : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతోనే దేశంలో హింసాత్మక నిరసనలు పెచ్చుమీరుతున్నాయని అగ్నిపథ్పై ఆగ్రహ జ్వాలలపై స్పందిస్తూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. కాషాయ పాలకుల వివాదాస్పద నిర్ణయాలను ప్రస్తావిస్తూ ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
భూసేకరణ చట్టం, 2015, 2016లో నోట్ల రద్దు, 2021లో వ్యవసాయ చట్టాలు, 2022లో అగ్నిపథ్ స్కీంను ప్రస్తావిస్తూ ప్రియాంక చతుర్వేది కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దేశానికి ఏం కావాలో తమకే తెలుసని భావిస్తూ కాషాయ పాలకులు ఏసీ గదుల్లో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు దేశంలో అశాంతి, అలజడికి దారితీస్తున్నాయని శివసేన ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.
యువతలో నిరుద్యోగంతో నెలకొన్న నిస్ప్రహను తాను అర్ధం చేసుకోగలనని, అయితే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం ఆమోదయోగ్యం కాదని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. విద్యార్ధులు సంయమనం పాటిస్తారని, సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని ఆమె అన్నారు. ఇక అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా ఉద్యోగార్ధులు, విద్యార్ధులు భగ్గుమంటున్నారు. తాజా రిక్రూట్మెంట్ స్కీంను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి.