ముంబై : ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని గురువారం ఉదయం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారీ కోరడంపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది స్పందించారు. గవర్నర్ నిర్ణయం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆమె ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం తుది విచారణ జరగకముందే బల పరీక్ష నిర్వహించడం కోర్టు ధిక్కరణేనని ప్రియాంక చతుర్వేది బుదవారం ట్వీట్ చేశారు.
16 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై జులై 11 వరకూ యథాతథ స్ధితి పాటించాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిన క్రమంలో బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని ఆమె నిలదీశారు. వారి అనర్హత పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం రాకముందే ఈ ఎమ్మెల్యేలు బల పరీక్షకు ఎలా హాజరవుతారని ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు.
బలపరీక్షపై మహారాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శివసేన నేత సంజయ్ రౌత్ ఇప్పటికే స్పష్టం చేశారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్లో ఉండగా బలపరీక్షపై మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం సరైంది కాదని అన్నారు. మరోవైపు రేపటి బలపరీక్షకు తాము సిద్ధంగా ఉన్నామని, ఓటింగ్కు తాము దూరంగా ఉండబోమని, శివసైనికులుగా కొనసాగుతామని రెబెల్ నేత ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు.