ఉదయ్పూర్లో జరుగుతున్న నవ సంకల్ప్ చింతన్ శిబిర్ రెండు రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ అనూహ్య డిమాండ్ తెరపైకి వచ్చింది. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించాలన్న డిమాండ్ ఒక్కసారిగా ప్రతినిధుల నుంచి రావడంతో హైకమాండ్ నివ్వెరపోయింది. నిజానికి.. ఉదయం సెషన్లో పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ నేతలందరూ ఎప్పటిలాగే చేశారు. ఈ సమయంలో హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
రాహుల్… రాహుల్ అంటూ స్లోగన్స్ ఇచ్చిన ప్రతినిధులు… సాయంత్రం సెషన్లో ప్రియాంక గాంధీ రావాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు రాహుల్ చేపట్టాలన్న డిమాండ్ బలంగా వుండేది. ఉదయ్పూర్ చింతన్ శిబిర్ వేదికగా ప్రియాంకను అధ్యక్షురాలిగా చేయాలంటూ కొత్త డిమాండ్ రావడంతో హైకమాండ్కు పాలుపోవడం లేదు.
గత రెండేళ్లుగా… రాహుల్ గాంధీని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్లు చేస్తున్నామని, చాలా మంది ఇందుకు అనుగుణంగా సమర్థించడం కూడా చేశామని నేతలు గుర్తు చేశారు. అయినా… పార్టీ నుంచి స్పందన లేదని, రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి విముఖంగా ఉంటే… ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ వచ్చిన సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక.. ముగ్గురూ అక్కడే వున్నారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.