న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో ప్రైవేటు వ్యక్తులు ఇండియన్ రైల్వే నుంచి రైల్వే కోచ్లను లీజ్కు తీసుకోవచ్చు. లీజుకు మాత్రమే కాదు, కావాలనుకుంటే రైల్వే కోచ్లను ఏకంగా కొనుగోలు కూడా చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన కోచ్లతో సాంసృతిక, మతపరమైన ప్రదేశాలను కలుపుతూ సర్క్యూట్ ట్రెయిన్లను నడపవచ్చు. ఈ విధంగా రైల్వే ఆధారిత పర్యాటకానికి నాంది పలుకవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ అవకాశం కల్పించబోతున్నది.
రైల్వే బేస్డ్ టూరిజాన్ని ప్రోత్సహించేలా సరికొత్త విధాన రూపకల్పన కోసం రైల్వే శాఖ ఇటీవల ఒక కమిటీని నియమించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రైల్వే బేస్డ్ టూరిజంపై వివిధ భాగస్వాములతో ఇటీవల ఇండియన్ రైల్వే సమావేశం కూడా నిర్వహించింది. ఈ సమావేశానికి 90 శాతం మంది స్టేక్హెల్డర్స్ హాజరయ్యారు. వారంతా సిక్కు భక్తుల కోసం గురుద్వారా సర్క్యూట్లో టూరిస్ట్ రైళ్లను నడపడానికి ఉత్సాహం కనబర్చారు.
ఈ గురుద్వారా సర్క్యూట్లో అమృత్సర్లోని హర్మిందర్ సాహిబ్, ఢిల్లీలోని గురుద్వారా డమ్డమా సాహిబ్, నాందేడ్లోని గురుద్వారా హుజూర్ సాహిబ్, పట్నాలోని గురుద్వారా పట్నా సాహిబ్ ఉన్నాయి. దేశంలోని ప్రముఖ సిక్కు యాత్రా కేంద్రాలైన అమృత్సర్, పట్నా మధ్య ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపాలని ప్రధాని నరేంద్రమోదీ కూడా 2020లో ఇండియన్ రైల్వేకు ఒక సూచన చేశారు.
పూర్తి ఫర్నీచర్తో కూడిన కోచ్లను ఇండియన్ రైల్వే ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వనుంది. ఈ లీజు వ్యవధి కనిష్ఠంగా ఐదేండ్లు ఉంటుంది. అయితే, ఐదేసి సంవత్సరాల చొప్పున కోచ్ సర్వీస్ లైఫ్ ముగిసే వరకు లీజును పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ రైల్వే కోచ్ల లీజు, కొనుగోళ్లపై ఇండియన్ రైల్వే నామమాత్రపు సుంకాన్ని కూడా వసూలు చేస్తుంది.