కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య
కాంట్రాక్టు పనుల్లో మంత్రి ఈశ్వరప్ప
40 శాతం కమీషన్ అడిగారని ఆరోపణ
క్యాబినెట్ నుంచి తొలగించాలి: కాంగ్రెస్
బెంగళూరు, ఏప్రిల్ 12: కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. గతంలో పూర్తి చేసిన ఓ కాంట్రాక్టు డబ్బులు విడుదల చేయించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ ఇటీవల ఆరోపణలు చేసిన బీజేపీనేత, కాంట్రాక్టర్ అయిన సంతోష్ పాటిల్ ఉడిపిలోకి ఒక ప్రైవేటు లాడ్జిలో మంగళవారం శవమై కనిపించాడు. తన మృతికి మంత్రి ఈశ్వరప్పనే కారణమని పేర్కొంటూ మీడియాతో పాటు తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా సందేశం కూడా పంపినట్టు తెలుస్తున్నది. సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వ హత్య
మంత్రి ఈశ్వరప్పపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలన్నారు. ఇది బీజేపీ సర్కార్ చేసిన హత్య అని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విమర్శించారు. సంతోష్ పాటిల్ ఆరోపణలను ప్రధాని మోదీ, సీఎం బొమ్మై పట్టించుకోలేదని, సంతోష్ మృతికి వీరిద్దరూ కూడా కారణమేనని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి ఈశ్వరప్ప ఖండించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.