న్యూఢిల్లీ, జూలై 5: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జైళ్లలో సత్ప్రవర్తన కలిగి 50 ఏండ్లు దాటిన మహిళలు, ట్రాన్స్జెండర్ల శిక్షను రద్దుచేయాలని భావిస్తున్నది. ఆజాదికా అమృత్ మహోత్సవ్లో భాగంగా.. 60 ఏండ్లు దాటిన పురుష ఖైదీలు, మొత్తం శిక్షలో సగానికిపైగా పూర్తిచేసిన దివ్యాంగులను సైతం విడుదల చేయాలని యోచిస్తున్నది. శిక్షను పూర్తిచేసినప్పటికీ విధించిన జరిమానాలు చెల్లించక జైళ్లలో మగ్గుతున్న పేద ఖైదీల జరిమానాలను మాఫీ చేయడం ద్వారా లబ్ధిపొందుతారని పేర్కొన్నది.
అర్హతల కలిగిన ఖైదీలను మూడు విడతల్లో అంటే ఈ ఏడాది ఆగస్టు 15న, వచ్చే ఏడాది జనవరి 26న, ఆగస్టు 15న విడుదల చేయాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసింది. సీనియర్ సివిల్, పోలీస్ అధికారులతో కూడిన రాష్ట్రస్థాయి స్క్రీనింగ్ కమిటీ అర్హులైన ఖైదీల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విడుదల చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. మరణ శిక్ష, జీవిత ఖైదు, లైంగికదాడి, ఉగ్రవాద ఆరోపణలు, వరకట్న మరణాలు, మనీలాండరింగ్ కేసుల్లో దోషులకు ఈ ప్రత్యేక ఉపశమనం లభించదని స్పష్టంచేసింది. 2020 అధికారిక లెక్కల ప్రకారం.. పరిమితికి మించి జైళ్లలో ఖైదీలు ఉన్నారు. జైళ్లలో 4.03 లక్షల ఖైదీలుకుగాను, 4.78 లక్షలు మంది ఉన్నారు. వీరిలో సుమారు లక్ష మంది మహిళా ఖైదీలే కావడం గమనార్హం.