న్యూఢిల్లీ, ఆగస్టు 8: అయోధ్యలో బీజేపీ నేతల భూదందా అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా పరిగణించి విచారణ జరుపాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశాయి. బీజేపీ మేయర్, ఎమ్మెల్యేల, నేతలు అయోధ్యలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ 40 మంది ఆక్రమణదారుల పేర్లను అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఆదివారం విడుదల చేసిన విష యం తెలిసిందే. అయోధ్యలో భూస్కామ్ జరుగుతున్నదని ఏఐసీసీ అధికార ప్రతినిధి సుప్రియా ఆరోపించారు. తాము ముందు నుంచీ చెబుతున్న విషయాన్ని ఇప్పుడు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ బయటపెట్టిందన్నారు. ఆక్రమణలకు పాల్పడిన బీజేపీ నేతలను అరెస్ట్ చేయాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరారు. బీజేపీ నేతలకు అవినీతిపైనే విశ్వాసం ఉన్నదని, రాముడిపై లేదని ఎద్దేవాచేశారు.