న్యూఢిల్లీ : దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి స్వార్ధ రాజకీయాలను దేశం అనుమతించదని, సవాళ్లను ఎదుర్కొంటూ మున్ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. భారత అథ్లెట్ల ప్రతిభను ప్రశంసించిన ప్రధాని దేశం కొత్త రికార్డులను సృష్టిస్తున్న సమయంలో కొందరు పార్లమెంట్ సమావేశాలను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు.
41 ఏండ్ల తర్వాత భారత్ హాకీ టీమ్ టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిందని భారత యువత అనూహ్య విజయాలతో ముందుకు సాగుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఒకరి పురోగతి కుటుంబ నేపథ్యంపై కాకుండా శ్రమించే తత్వంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆగస్ట్ 5 భారత చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.