న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా పంచుకుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చన్న ఊహాగానాలు దేశ రాజధానిలో ఊపందుకున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, మంగళవారం ఉదయం కేరళకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు జార్జి కురియన్ కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 65 ఏండ్ల కురియన్ కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖల సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. జూన్ 21న రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం పూర్తయిన కురియన్ను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయకూడదని బీజేపీ నిర్ణయించింది.