Seva Teerth : స్వతంత్ర భారత దేశ చరిత్రలో, అత్యంత ప్రభావవంతమైన ప్రధాన మంత్రి కార్యాలయం చిరునామా తొలిసారి మారింది. ఇన్నేళ్ల తర్వాత ఢిల్లీలో నూతన ప్రధాన మంత్రి కార్యాలయం ప్రారంభమైంది. ‘సేవా తీర్థ్’ పేరుతో రూపొందిన నూతన ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించారు.
ఇకపై ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన సేవలన్నీ ఇక్కడ్నుంచే కొనసాగుతాయి. ఇప్పటివరకు సేవలందించిన కర్తవ్య భవనం 1, 2 లను ఇతర మంత్రిత్వ శాఖలకు కేటాయించారు. భారత ప్రభుత్వ పరిపాలనా భవనం కొత్త రూపు సంతరించుకుందని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. కొత్త భవనం ప్రారంభమైన సందర్భంగా రూ.100 ప్రత్యేక నాణేన్ని ప్రధాని విడుదల చేశారు. ప్రధాని కార్యాలయం ఆధునికంగా, పౌర సేవలకు మరింత అనుకూలంగా ఉండాలనే మోదీ ఆలోచనకు అనుగుణంగా నూతన కార్యాలయం నిర్మితమైంది. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ప్రధాని కార్యాలయం ఒక చోటు నుంచి మరో చోటుకు మారడం ఇదే మొదటిసారి. ఇక సేవా తీర్థ్లో ప్రధాని కార్యాలయం (సేవా తీర్థ్-1), నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ (సేవా తీర్థ్2), క్యాబినెట్ సెక్రటేరియట్ (సేవా తీర్థ్-3) పని చేస్తాయి.
ఇవి గతంలో వేర్వేరు చోట్ల ఉండేవి. ఇకపై అన్నీ ఒకే చోట ఉంటాయి. కొత్త కార్యాలయంలో ప్రధాని మోదీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం రహత్ స్కీంను ప్రారంభించారు. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత తక్షణ చికిత్స అందుతుంది. లఖ్పతి దీదీ పథకం లక్ష్యాన్ని 2029 వరకు మూడు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు చేరుస్తారు. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 కింద రూ.10,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తారు. ఇలాంటి పలు కీలక నిర్ణయాన్ని ప్రధాని కొత్త ఆఫీసులో తొలి రోజే తీసుకున్నారని పీఎంఓ వర్గాలు తెలిపాయి.