భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’ కోసం నలుగురు వ్యోమగాములు ఎంపికయ్యారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా వచ్చే ఏడాది స్వదేశీ వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎంపికైన వ్యోమ సిబ్బంది వివరాలను ప్రధాని మోదీ ప్రకటించారు.
తిరువనంతపురం, ఫిబ్రవరి 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో త్వరలో చేపట్టనున్న గగన్యాన్ యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను ప్రధాని నరేంద్రమోదీ దేశానికి పరిచయం చేశారు. తుంబాలోని విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ (బీఎస్ఎస్సీ)లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో వ్యోమగాములుగా శిక్షణ పొందుతున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాను పరిచయం చేశారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ఈ నలుగురు ప్రతినిధులని కొనియాడారు.
‘ఇది మన సమయం.. రాకెట్ కూడా మనదే. వీరు (వ్యోమగాములు) నలుగురు వ్యక్తులు కాదు.. నాలుగు శక్తులు’ అని వ్యాఖ్యానించారు. గగన్యాన్లోని కీలకమైన పరికరాలన్నీ దేశీయంగానే తయారుచేయటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతి దేశంలోని యువతకు గొప్ప అవకాశాలను సృష్టించటమేకాక దేశాన్ని 21వ శతాబ్దంలో గొప్ప ప్రపంచ శక్తిగా నిలబెట్టిందని పేర్కొన్నారు. మొదటి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరిన అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని, ఒకే రాకెట్తో వంద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఘనత కూడా భారత్ సొంతమని గుర్తుచేశారు. బంగారు భవిష్యత్తుకు ఇస్రో బృందం తలుపులు తెరిచిందని కొనియాడారు.
నాయర్ కేరళలోని తురువేజియాడ్లో 1976 ఆగస్టు 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)లో శిక్షణ తీసుకొన్నారు. ఎయిర్ఫోర్స్ అకాడమీలో స్వార్డ్ ఆఫ్ హానర్ అందుకొన్నారు. 1998 డిసెంబర్ 19న ఐఏఎఫ్లో చేరారు. ఎస్యూ 30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, హాక్, డోర్నియర్, ఏఎన్-32 తదితర యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉన్నది. ‘ఏ’ క్యాటగిరి ఫ్లైయింగ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశారు. యుద్ధవిమానాలను 3000 గంటలపాటు నడిపిన అనుభవం ఉన్నది. ఈయన యునైటెడ్ స్టేట్స్ స్టాఫ్ కాలేజీ పూర్వ విద్యార్థి. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్గా పనిచేశారు.
అజిత్ కృష్ణన్ తమిళనాడులోని చెన్నైలో 1982, ఏప్రిల్ 19న జన్మించారు. ఎన్డీయేలో శిక్షణ తీసుకొన్నారు. రాష్ట్రపతి మెడల్ అందుకొన్నారు. ఐఏఎఫ్లో స్వార్డ్ ఆఫ్ హానర్ అందుకొన్నారు. ఐఏఎఫ్ ఫైటర్ స్ట్రీమ్లో 2003, జూన్ 21న చేరారు. ఎస్యూ-30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, జాగ్వార్, డోర్నియర్, ఏఎన్-32 తదితర విమానాలను 2,900 గంటలపాటు నడిపిన అనుభవం ఈయనకు ఉన్నది. ఈయన కూడా వెల్లింగ్టన్లోని డీఎస్ఎస్సీ పూర్వ విద్యార్థి.
ప్రతాప్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 1982 జూలై 17న జన్మించారు. ఎన్డీయేలో శిక్షణ తీసుకొన్నారు. 2004, డిసెంబర్ 18న ఐఏఎఫ్లో చేరారు. ఎస్యూ-30 ఎంకేఐ, మిగ్-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, ఏఎన్-332 తదితర విమానాలను 2000 గంటలపాటు నడిపిన అనుభవం ఉన్నది.
శుక్లా లక్నోలో 1985 అక్టోబర్ 10న జన్మించారు. 2006, జూన్ 17న ఐఏఎఫ్లో చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్గా, టెస్ట్ పైలట్గా ఈయనకు 2000 గంటలపాటు వివిధ రకాల యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉన్నది.