శ్రీనగర్: ప్రధాని నరేంద్రమోదీ సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ ఉదయం జమ్ముకశ్మీర్ రాజౌరీ సెక్టార్లోని నౌషెరాకు చేరుకుని అక్కడ అమర జవాన్ల స్మారకం వద్ద నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. అనంతరం అక్కడ సైనికులతో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. తాను 2014 నుంచి ప్రతి ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకుంటున్నానని గుర్తుచేశారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా మీతో పండుగ చేసుకునేందుకు నౌషెరాకు వచ్చానని సైనికులను ఉద్దేశించి చెప్పారు. ఇంకా ప్రధాని ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘నేను ఇక్కడికి ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా. సైన్యం కోసం 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకొచ్చా. ప్రతి దీపావళి సైనికులతో జరుపుకుంటున్నా. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉంది. సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారు. సర్జికల్ స్ట్రైయిక్లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణం. దేశానికి సైన్యం సురక్షా కవచం’.
అంతకుముందు ప్రధాని దేశ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.