లక్నో, జూన్ 13: ప్రభుత్వమే కోర్టులాగా కీలక తీర్పులను వెలువరిస్తుంది. విచారణ లేకుండానే అనుమానితులను దోషులుగా తేల్చుతుంది. అక్రమ నిర్మాణాల నెపంతో లక్షిత వర్గాల ఇండ్లను కూల్చుతుంది. అది కూడా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే.. ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ డబుల్ ఇంజిన్ యూపీలో ‘బుల్డోజర్ రాజ్’ పాలన ఎలా ఉంటుందో తెలియజేయడానికి పై నాలుగు వ్యాఖ్యలు చాలు. ప్రయాగ్రాజ్లో చెలరేగిన హింసకు ప్రధాన కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్ జావెద్తో పాటు అతని సన్నిహితుల ఇండ్లను యూపీ సర్కారు బుల్డోజర్లతో కూల్చివేసిన సంఘటన కలకలం సృష్టిస్తున్నది. దీనిపై అలహాబాద్ మాజీ సీజే గోవింద్ మాథుర్ స్పందించారు. ఇండ్ల కూల్చివేత చట్టవిరుద్ధమని తేల్చిచెప్పారు. ‘ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఒకవేళ ఇంటి నిర్మాణం అక్రమమని భావిస్తే, కోట్లాది భారతీయులు దేశంలో ఎలా నివసిస్తున్నారో అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇంటి యజమాని, నివాసితులు పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ఇండ్లను కూల్చివేసే అనుమతి ఎవరికీ ఉండదు’ అన్నారు.
అక్రమ నిర్మాణాలపై ఏమైనా ఫిర్యాదులు, తదనంతర సమస్యలు ఉంటే కోర్టుల్లో సవాల్ చేయాలి అని, నోటీసుల్లేకుండా ఇండ్లను కూల్చివేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిరసన జరిగినప్పుడే బీజేపీ ప్రభుత్వానికి లక్షిత వర్గాల ఇండ్లు అక్రమ నిర్మాణాలనే విషయం గుర్తుకొస్తుందని, ఆ వెంటనే బుల్డోజర్లు రంగంలోకి దిగుతాయని విపక్ష నేతలు మండిపడుతున్నారు. బుల్డోజర్ల కూల్చివేతల ఘటనలకు సంబంధించి అలహాబాద్, మధ్యప్రదేశ్ హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా ఇండ్లు కూల్చేయకూడదంటూ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని జమాయత్ ఉలేమా-ఇ-హింద్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మహ్మద్ ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై వివరణ కోసం కోల్కతా పోలీసులు బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20న తమ ముందు హాజరు కావాలని నర్కేల్దంగా పోలీసులు ఆదేశించారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. నూపుర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
నూపుర్ వ్యాఖ్యలపై కువైట్లో నిరసనలు తెలిపిన విదేశీయులను అరెస్టు చేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అదుపులోకి తీసుకొన్న తర్వాత వారిని స్వదేశాలకు పంపనున్నది. కువైట్లో చట్టాల ప్రకారం విదేశీయులు నిరసన చేయరాదు. పాల్గొనరాదు. శుక్రవారం ఫహాహీల్ ప్రాంతంలో కొంతమంది విదేశీయులు నూపుర్, నవీన్ జిందాల్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.