Double Engine Government | ఉజ్జయిని, మే 29: బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ ‘ట్రబుల్ ఇంజిన్’ అని మరోసారి తేటతెల్లమైంది. ఇందుకు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని పట్టణం తాజా సాక్ష్యంగా నిలిచింది. ప్రధాని మోదీ ఏడు నెలల క్రితం ఆర్భాటంగా ప్రారంభించిన మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు అతలాకుతలం అయింది. అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలు నేలకూలాయి. ఏడు సప్తఋషుల విగ్రహాల్లో ఆరు దెబ్బతిన్నాయి. ఒక విగ్రహానికి తల విరిగిపోగా, మరికొన్నింటి చేతులు, ఇతర భాగాలు ధ్వంసం అయ్యాయి.
ప్రాజెక్టు నిర్మాణం, విగ్రహాల తయారీని ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు చెందిన ఎంపీ బబారియా, ఇతర కంపెనీలు చేపట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. మహాకాల్ ప్రాజెక్టులో భారీ అవినీతి చోటుచేసుకొన్నదని, నాసిరకం పనులతో నిధులు స్వాహా చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దర్యాప్తు జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్టుగా, దేవుళ్లను కూడా బీజేపీ వదలడం లేదని కాంగ్రెస్ నేత అరుణ్యాదవ్ విమర్శించారు. ఉజ్జయినిలో మహాకాలేశ్వర్ ఆలయ సమీపంలో రూ.856 కోట్లతో మహాకాల్ ప్రాజెక్టు చేపట్టారు. రూ.351 కోట్లతో పూర్తైన మొదటి దశను ప్రధాని మోదీ గత అక్టోబర్లో ప్రారంభించారు.