PM Modi | న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఎన్నికల బాండ్లను రద్దు చేయడం ద్వారా దేశం మరోసారి నల్లధనం వైపునకు నెట్టివేయబడిందని, దీనిపై ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప పడతారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఉన్న ఎన్నికల బాండ్లపై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం ఓ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
విరాళాలు ఇచ్చిన 16 కంపెనీల ద్వారా కేవలం 37 శాతం మాత్రమే బీజేపీకి రాగా.. మిగిలిన 63 శాతం బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు వచ్చాయని మోదీ పేర్కొన్నారు. రాజకీయ విరాళాలన్నింటినీ చెక్కుల రూపంలో తీసుకోవాలని బీజేపీ గతంలో నిర్ణయించిందనీ, అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని వ్యాపారులు అంగీకరించలేదని మోదీ చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మంచి జరిగిందా? చెడు జరిగిందా? అన్నది ఎప్పటికీ చర్చనీయాంశంగానే ఉంటుందన్నారు.