న్యూఢిల్లీ, జూలై 4: ఎన్ని అబద్ధాలు.. ఎంత దారుణం.. సిగ్గు సిగ్గు.. ప్రపంచ వేదికపైనే ప్రధాని మోదీ ఝూటా మాటలు.. ఈ మాట అంటున్నది కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే. వాటిని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచింది ఫ్యాక్ట్చెకర్.ఇన్. గత నెల 26-28వ తేదీల మధ్య జీ7 దేశాల సదస్సు కోసం ప్రధాని మోదీ జర్మనీ వెళ్లారు. అక్కడ జరిగిన సదస్సులో భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో ప్రగతి సాకారం అయ్యిందంటూ తెలిపారు. దేశమంతా బహిరంగ మల విసర్జన రహితం అయ్యిందని, అన్ని గ్రామాలకు విద్యుత్తు అందుతున్నదని, ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయం ఉన్నదని వెల్లడించారు. అందులో వాస్తవమెంత? అని ఫ్యాక్ట్చెకర్.ఇన్ ఆరా తీస్తే అసలు విషయాలు బయటపడ్డాయి.
దేశంలోని ప్రతి గ్రామం బహిరంగ మల విసర్జన రహితం అయ్యింది.
ఫ్యాక్ట్చెకర్.ఇన్ జవాబు: అబద్ధం
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా 2019 అక్టోబర్ నాటికి దేశం బహిరంగ మల విసర్జన రహితం అయ్యిందని కేంద్రం ప్రకటించింది. కానీ, స్వచ్ఛ భారత్ రికార్డులు, అధికారిక డాటాలో వ్యత్యాసాలు ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం దేశంలో 83 శాతం ఇండ్లకు మాత్రమే మరుగుదొడ్డి సదుపాయం ఉన్నది. 17 శాతం మంది ఇంకా బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. యూనిసెఫ్ 2021 నివేదిక ప్రకారం భారత్లో కనీసం 15 శాతం మంది బహిరంగ మల విసర్జన చేస్తున్నారు.
దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయం ఉన్నది.
ఫ్యాక్ట్చెకర్.ఇన్ జవాబు: అబద్ధం
500, అంతకంటే ఎక్కువ మంది జీవించే మైదాన ప్రాంత గ్రామాలు.. 250, అంతకంటే ఎక్కువ మంది నివసించే కొండ ప్రాంత గ్రామాల్లో రోడ్డు సదుపాయం కల్పించేందుకు 2000వ సంవత్సరంలో ప్రధాన్మంత్రి గ్రామ్ సడక్ యోజనను కేంద్రం తీసుకొచ్చింది. కానీ, 2017-2021 మధ్య రోడ్ల నిర్మాణానికి విధించుకొన్న ఏ లక్ష్యాన్ని కేంద్రం పూర్తి చేయలేదు. 2021-22లో 2,025 గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నా.. 1,216 గ్రామాలకే సదుపాయం కల్పించగలిగింది.
దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్తు సదుపాయం ఉన్నది.
ఫ్యాక్ట్చెకర్.ఇన్ జవాబు: అబద్ధం
దేశంలోని అన్ని గ్రామాలకు 24*7 విద్యుత్తు అందించేందుకు 2014 డిసెంబర్లో దీన్దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. మిగిలిన గ్రామాలకు విద్యుత్తు, విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు 2017 అక్టోబర్లో ప్రధాన్మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజనను ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్తు అందుతున్నదని 2018 ఏప్రిల్ 28న కేంద్రం ప్రకటించింది. కానీ, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం దేశంలో 96.8 శాతం ప్రజలకే విద్యుత్తు అందుతున్నది. ఇంకా 3.2 శాతం ఇండ్లకు కరెంటు సదుపాయమే లేదు. ఉత్తరప్రదేశ్లో 24 గంటల విద్యుత్తు అందుతున్నదని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు. కానీ, ఇతాహ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇప్పటికీ విద్యుత్తు అందటం లేదు.
దేశంలోని ప్రతి పేదవాడు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకొంటున్నాడు.
ఫ్యాక్ట్చెకర్.ఇన్ జవాబు: అబద్ధం
ఆయుష్మాన్ భారత్ పథకం కింద కుటుంబానికి ఏటా రూ.5 లక్షల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ పథకానికి ఉన్న కఠిన నిబంధనల ప్రకారం పేదలంతా లబ్ధిదారులు కాలేరు. మొత్తంగా చూసుకొన్నా.. ఈ పథకం కింద 13.44 కోట్ల కుటుంబాలు (65 కోట్ల మంది ప్రజలు) ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ రాష్ర్టాలు ఈ పథకాన్ని అమలు చేయటం లేదు. దాని ప్రకారం చూసినా దేశంలోని ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఉచిత వైద్యం అందనట్టే.