న్యూఢిల్లీ, మార్చి 24: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మెల్లిమెల్లిగా ప్రపంచమంతా విస్తరిస్తున్నది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు భారత్లో వంటగ్యాస్, చమురు, ఎరువులకు విస్తరించిన కొరత ఇప్పుడు ఔషధ పరిశ్రమపై కూడా పడనుంది. యుద్ధ ప్రభావం భారత మందుల సరఫరా చైన్పై పడటంతో ముఖ్యమైన ఔషధాల ముడి సరుకు ధరలు కేవలం 15 రోజుల వ్యవధిలోనే 200 నుంచి 300 శాతం పెరిగాయి. దీంతో దేశంలో ఆయా మందుల ధరలు పెరగడమే కాక, వాటికి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) ఔషధ పరిశ్రమలు 500కు పైగా ఉండే హిమాచల్ ప్రదేశ్లోని డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఈ మేరకు ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. కేంద్ర ఆరోగ్య శాఖకు సోమవారం ఒక లేఖ రాసింది. ఈ విషయంలో కేంద్రం అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. భారత్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో వాడే పారాసిట్మాల్ తయారీలో వాడే ముడి సరుకు ధర 15 రోజుల వ్యవధిలో కేజీ రూ. 250 నుంచి రూ.450కు చేరుకుంది. మిగతా ముడి పదార్ధాలది ఇదే తీరని, ఈ ధరలు ఇలాగే కొనసాగితే ప్రస్తుత ధరలకే తాము మందులను తయారు చేయలేమని, ధరలను పెంచక తప్పదని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు శర్మ తెలిపారు.
టాప్-4 కాలుష్య నగరాల్లో మూడు భారత్లోనే
న్యూఢిల్లీ: ఐక్యూ ఎయిర్ స్విస్ వాయు నాణ్యత సాంకేతిక సంస్థ విడుదల చేసిన 2025 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక మన దేశంలో వేగంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కండ్లకు కట్టింది. ఆ నివేదిక ప్రకారం మన దేశ నగరాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ‘లోని’ నగరం మన దేశంలో అత్యంత కాలుష్య నగరంగా అపకీర్తి మూటగట్టుకుంది. ఆ తర్వాతి మూడు స్థానాల్లో ఈశాన్య భారత్లోని బైర్నిహట్, ఢిల్లీ, ముల్లాన్పూర్(పంజాబ్) ఉన్నాయి. 143 దేశాల్లోని 9,400 నగరాల్లోని పరిస్థితులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. దాని ప్రకారం అత్యంత కాలుష్య నగరాలు దక్షిణాసియా దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం కలిగిన టాప్ -4 నగర్లాలో మూడు మన దేశంలోనే ఉన్నాయి. లోని నగరం వార్షిక సగటు పీఎం 2.5 గాఢతను 112.5 గ్రా/క్యూబిక్ మీటర్గా నమోదు చేసింది.
ఇది డబ్ల్యూహెచ్వో మార్గ దర్శకాల కంటే 22 రెట్లు ఎక్కువ. .