భువనేశ్వర్: ఒడిశాలో గత శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడిన గతి తెలిసిందే. అయితే బాలాసోర్లోని స్కూల్లో ఉంచిన వందలాది మృతదేహాల మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. చనిపోయాడని భావించిన అతడు ఒక రెస్క్యూ సిబ్బంది కాళ్లు పట్టుకున్నాడు. తాను బతికే ఉన్నానని చెప్పాడు. తాగడానికి మంచినీరు ఇవ్వాలని, తనను కాపాడాలంటూ వేడుకున్నాడు.
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా చర్నేఖలి గ్రామానికి చెందిన 35 ఏళ్ల రాబిన్ నయ్యా 8 మంది స్నేహితులతో కలిసి పని కోసం కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఆంధ్రప్రదేశ్కు బయలుదేరాడు. గత వారం ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో రాబిన్ నయ్యా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. దీంతో రెస్క్యూ సిబ్బంది అతడు చనిపోయాడని భావించారు. బాలాసోర్లోని ఒక స్కూల్ రూమ్లో ఉంచిన వందలాది మృతదేహాల వద్దకు అతడ్ని చేర్చారు.
కాగా, కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత రాబిన్ నయ్యా స్పృహలోకి వచ్చాడు. మృతదేహాలను స్కూల్ నుంచి తరలిస్తున్న రెస్క్యూ సిబ్బందిలో ఒకరి కాళ్లను పట్టుకున్నాడు. తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉన్న అతడు దాహంగా ఉందని మంచినీరు ఇవ్వాలని కోరాడు. తాను చనిపోలేదని, బతికే ఉన్నానని చెప్పాడు. తనను కాపాడాలని వేడుకున్నాడు. దీంతో రెస్క్యూ సిబ్బంది వెంటనే రాబిన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన రాబిన్ నయ్యా రెండు కాళ్లు కోల్పోయాడు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడి పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని బంధువు తెలిపాడు. రాబిన్తోపాటు కోరమాండల్ రైలులో ప్రయాణించిన వారిలో ఆరుగురు వ్యక్తుల జాడ ఇంకా తెలియలేదని చెప్పాడు.