కోల్కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ, సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ఆ రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళుతున్నది. బీజేపీ కొత్త ప్రభుత్వం శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ అరుదైన పరిస్థితిపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ స్పందిస్తూ.. సీఎం రాజీనామా చేయకుంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనదని పేర్కొంటూ గవర్నర్ ఆర్టికల్ 356(రాష్ట్రపతి పాలన) ప్రయోగించవచ్చని తెలిపారు.
ఒకటి రెండు రోజుల కోసమైనా సరే, ఇలాంటి స్థితిలో రాష్ట్రపతి పాలనే ఏకైక మార్గం. ఒకే సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారంలో ఉండలేరని ఆయన వివరించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. మమత ఇలా అడ్డుపడడం వల్ల రాజ్యాంగపరమైన గందరగోళం తప్ప మరేమీ సాధించలేరని పేర్కొన్నారు. అసెంబ్లీలో విశ్వాసం కోల్పోయిన సీఎం పదవిలో కొనసాగడానికి వీల్లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. చివరికి, మెజారిటీ ఉన్న పార్టీకి అధికారాన్ని అప్పగించే బాధ్యత ఇప్పుడు గవర్నర్పై ఉన్నది.