న్యూఢిల్లీ: ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని ‘భారతీయత’ పండుగగా జరుపుకోవాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశప్రజలకు పిలుపునిచ్చారు. మానవజాతికి కరోనా వైరస్ రూపంలో అసాధారణమైన సవాలు ఎదురైన వేళ మనదేశం ‘అద్వితీయమైన దీక్ష’ ను ప్రదర్శించిందని ప్రశంసించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. శక్తిమంతమైన, సున్నితంగా స్పందించే భారత్ ఆవిష్కృతమవుతున్నదని రాష్ట్రపతి పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా ఈసారి ఉత్సవాలు సీదాసాదాగా జరగొచ్చని, అయినా స్ఫూర్తి మాత్రం అనునిత్యం బలోపేతమవుతున్నదన్నారు. వైరస్ విషయంలో ఏమరుపాటుగా ఉండొద్దని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు చెప్పారు. మహిళలు మరో ముందంజ సాధించి సాయుధబలగాల్లో పర్మనెంట్ కమిషన్డ్ ఆఫీసర్లుగా చేరుతుండడంపై సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతి హర్షం వెలిబుచ్చారు. గాంధీజీ, నేతాజీ వంటి స్వాతంత్య్ర పోరాటయోధులను ప్రసంగంలో స్మరించారు.