President Murmu | పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పబ్లిక్ పరీక్షల అక్రమ మార్గాల నిరోధక బిల్లు-2024 పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్సభ, రాజ్యసభ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రవేశ పరీక్షలన్నింటిలో అక్రమాలను అరికట్టడం, అవకతవకలపై దర్యాప్తు చేయడమే ఈ చట్టం ఉద్దేశం. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పారదర్శకత, విశ్వసనీయత తీసుకువచ్చే ఉద్దేశంతో బిల్లును కేంద్రం రూపొందించింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపగా.. అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నది.
ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా పేపర్ లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్సైట్లు తెరిచినా గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్డీఏ తదితర పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ఎంట్రన్స్ టెస్టులకు సైతం చట్టం వర్తిస్తుంది. అయితే, గత కొన్నేళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థుల నష్టపోయారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో పేర్కొన్నారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్న ఆయన.. చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకున్నట్లేనన్నారు.