Modi on Murmu | రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. దీంతో ఆమెకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయం ప్రజాస్వామ్యానికి శుభసూచకం అని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. గురువారం రాత్రి మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత సగం ఓట్ల మార్కును ద్రౌపది ముర్ము దాటారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ప్రకటించగానే ప్రధాని మోదీ.. ద్రౌపది ముర్ము నివాసానికి చేరుకున్నారు. ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల ఆశా కిరణం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆమెను కలుసుకుని పుష్పగుచ్చం అందచేసి అభినందించారు.
`భారతీయులంతా అజాదీకా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న వేళ గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవ్వడంతో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఆమె జీవితం, సేవ, ఆదర్శప్రాయ విజయాలు ప్రతి ఇండియన్కు స్ఫూర్తిగా నిలుస్తాయి` అని మోదీ ట్వీట్ చేశారు. ఆమె ప్రజల ఆశా కిరణం. దేశాన్ని ముందు ఉండి నడిపిస్తూ.. అభివృద్ధిని బలోపేతం చేసే అత్యుత్తమ రాష్ట్రపతిగా నిలుస్తారని భావిస్తున్నా` అని తెలిపారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ముకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అభినందనలు తెలిపారు. దేశ 15వ రాష్ట్రపతిగా.. రాజ్యాంగ పరిరక్షకురాలిగా. నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని దేశం భావిస్తుందన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. దేశంలో పలు విభేదాలు పొడచూపుతున్న వేళ రాజ్యాంగ ఆదర్శాలు కాపాడి, ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా ద్రౌపది ముర్ము నిలుస్తారని యావత్ జాతి చూస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.