బెంగళూరు: మహిళలకు చీరలంటే మక్కువ ఎక్కువ. ఇంట్లో పట్టుచీరలు, ఉత్తచీరలు ఎన్ని ఉన్నా వారి మనసు మాత్రం మరో కొత్త చీర మీదకే లాగుతుంది. ఇక ఆ చీర చరిత్ర ఘనమైనది, విలువ వెలకట్టలేనిది అయితే వారి ఆనందానికి అంతే ఉండదు. ఈ విషయంలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అతీతులేం కాదు. ఇవాళ మైసూరులోని చాముండీ హిల్స్పైన దసరా ఉత్సవాలను ప్రారంభించిన ఆమె.. సిల్క్ చీరలో మెరిసి మురిసిపోయారు.
ఆమె ధరించిన చీర అట్టాంటి ఇట్టాంటి సిల్క్ చీర కాదు. శతాబ్దానికిపైగా చరిత్ర కలిగిన మైసూర్ సిల్క్ చీర. కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఈ నేత చీరను తయారుచేసింది. ఈ ఫ్యాక్టరీని 1912లో మైసూరు మహారాజులు స్థాపించారు. కాగా, మైసూర్ సిల్క్ శారీ ధరించిన రాష్ట్రపతి ముర్ము దసరా ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దానికి తోడు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముర్ము తలపై ప్యాటాను అలంకరించడంతో ఆ ఆకర్షణ రెట్టింపయ్యింది.
మైసూరు జిల్లా పాలనా యంత్రాంగానికి చెందిన ప్రతినిధి బృందం ఇటీవల రాష్ట్రపతి భవన్కు వెళ్లి ఆమెను దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది. ఆ సందర్భంగానే ఆ బృందం ఆమె కోసం ప్రత్యేకంగా నేయించిన మైసూరు సిల్క్ శారీని బహూకరించింది. ఆ చీరను ధరించే రాష్ట్రపతి ముర్ము దసరా ఉత్సవాలను ప్రారంభించారు. బంగారు జరి అంచుతో ఉన్న ఆ చీరలో రాష్ట్రపతి చూడముచ్చటగా కనిపించారు.