Supreme Court : భారతీయ న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు (జడ్జీల సంఖ్య) సవరణ చట్టం–2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీని ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 34 మంది సుప్రీం జడ్జీల సంఖ్య ఇకపై 38కి పెరగనుంది.
ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఆర్జున్ రామ్ మేఘవాల్ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ప్రతిపాదనను ఆమోదిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నట్లు అర్జున్ రామ్ తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచాలంటూ పార్లమెంట్ రూపొందించిన సవరణ చట్టానికి ఈ నెల 5న మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేశారు. అనంతరం రాష్ట్రపతికి పంపగా ఆమె ఆమోదించారు. జడ్జీల సంఖ్య పెంపు నిర్ణయంపై లాయర్లు, ఇతర జడ్జీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసులు పేరుకుపోతున్న నేపథ్యంలో జడ్జీల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అని అభిప్రాయపడుతున్నారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీనియర్ లాయర్ వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ఈ డిమాండ్ ఎప్పటినుంచో పెండింగ్లో ఉందని, ఇప్పటికైనా ఈ సంఖ్య పెంచడం మంచిదన్నారు. అలాగే, కేసుల పరిష్కారానికి వీలుగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీంకోర్టులో నిర్మాణం చేపడుతున్న కొత్త బిల్డింగ్ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త బిల్డింగ్ 38 మంది జడ్జీలు విధులు నిర్వర్తించేందుకు సరిపోతుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరిగి 50 మందికి అయినా అందుబాటులో ఉంటుందని వికాస్ సింగ్ అన్నారు.