న్యూఢిల్లీ, జనవరి 25: భారత రాజ్యాంగమే మనకు అన్నివేళలా మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి బుధవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాత దార్శనికత మన గణతంత్ర దేశానికి నిరంతరం మార్గదర్శకంగా పనిచేస్తుందని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పాటు రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకొన్న వారందరినీ ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకొంటుందని, రాజ్యాంగానికి తుది రూపం ఇవ్వడంలో అంబేద్కర్ కీలక భూమిక పోషించారని చెప్పారు. గతంలో పేద, నిరక్షరాస్య దేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసం నిండిన దేశంగా పరివర్తన చెందిందని ముర్ము అన్నారు. దీనివెనుక రాజ్యాంగ నిర్మాతల సమిష్టి మేధాశక్తి ఉన్నదని, లేకుంటే ఈ పరివర్తన సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. భారత దేశంలో విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ, అవి మనల్ని ఏకం చేశాయే తప్ప ఏనాడూ విభజించలేదని, అందువల్లే మనం ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా విజయవంతమయ్యాయని, ఇది భారతదేశ గొప్పతనమని వ్యాఖ్యానించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పాటు రాజ్యాంగ రూపక్పలనలో పాలుపంచుకొన్న వారందరినీ ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకొంటుంది. గతంలో పేద, నిరక్షరాస్య దేశంగా ఉన్న భారత్.. ప్రపంచ వేదికపై ఇప్పుడు ఆత్మవిశ్వాసం నిండిన దేశంగా పరివర్తన చెందడం వెనుక రాజ్యాంగ నిర్మాతల సమిష్టి మేధాశక్తి ఉన్నది. లేకుంటే ఈ పరివర్తన సాధ్యమయ్యేది కాదు
– గణతంత్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి ముర్ము