చెన్నై : తమిళనాడులో బ్రాహ్మణేతర పూజారుల నియామకానికి రంగం సిద్ధమైంది. 100 రోజుల్లో 200 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించనున్నట్లు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై బీజేపీ గుర్రుగా ఉన్నది. తమ హిందూ వ్యతిరేక ఆలోచనలను డీఎంకే బయటపెడుతున్నదని తీవ్రంగా విమర్శించింది. బ్రాహ్మణేతర పూజారుల నియామకం రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
త్వరలో 100 రోజుల ‘శైవ అర్చక్’ కోర్సును తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించనున్నది. ఈ కోర్సును పూర్తి చేసిన వారెవరైనా పూజారిగా నియమితులు కావచ్చు. ఈ నియామకాలు తమిళనాడు హిందూ మత, ఛారిటబుల్ ఎండోమెంట్ విభాగం (హెచ్ఆర్ అండ్ సీఈ) పరిధిలోని 36,000 దేవాలయాల్లో జరుగనున్నాయి. 70-100 మంది బ్రాహ్మణేతర పూజారుల మొదటి జాబితా కొద్ది రోజుల్లో విడుదల కానున్నది. ఇలాఉండగా, తమిళనాడు ఛారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు తన మంత్రిత్వ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పూజలు తమిళంలోనే జరుగుతాయని ఇటీవల చెప్పడం కూడా వివాదానికి తావిస్తున్నది.
తమిళనాడు దేవాలయాలకు వేల సంవత్సరాల సంప్రదాయం ఉన్నదని, ఈ సంప్రదాయాన్ని డీఎంకే తిరగరాస్తున్నదా? అని బీజేపీ సీనియర్ నాయకుడు నారాయణన్ తిరుపతి అని ప్రశ్నించారు. రాజకీయ లాభాల కోసం డీఎంకే హిందువుల్లో తేడాలు సృష్టిస్తున్నదని, ఈ విధంగానే గత ఎన్నికల్లో లబ్ధి పొందారని దుయ్యబట్టారు. హిందూ వ్యతిరేక ప్రధాన ఆలోచన ఆధారంగా డీఎంకే పార్టీ పునాది ఏర్పడిందని విమర్శించారు. మసీదు లేదా చర్చిపై ప్రభుత్వం ఇలాంటి నియంత్రణ చేపట్టే ధైర్యం చేస్తుందా? అని ప్రశ్నించింది. 100 రోజుల కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎవరైనా ఎలా పూజారి అవుతారు? ఇది పురాతన సంప్రదాయానికి అవమానం అని బ్రాహ్మణ పూజారుల సంఘం ప్రతినిధి ఎన్ శ్రీనివాసన్ తెలిపారు.
బ్రాహ్మణేతర పూజారుల కోసం పోరాటం పాతదని మద్రాస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మణివన్నన్ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 1970 లో పెరియార్ ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు డీఎంకే ప్రభుత్వం ఈ నియామకాలు జరుపాలని ఆదేశించింది. 1972 లో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వును నిలిపివేయగా.. 1982 లో అప్పటి సీఎం ఎంజీ రామచంద్రన్ జస్టిస్ మహారాజన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. శిక్షణ తర్వాత అన్ని కులాల వారిని పూజారులుగా నియమించాలని కమిషన్ సిఫారసు చేసింది. 25 సంవత్సరాల తర్వాత డీఎంకే ప్రభుత్వం 2006 లో మళ్ళీ ఈ నియామకాలకు ఆదేశించింది. 2007 లో ఒక సంవత్సరం కోర్సు ప్రారంభమైంది. 206 మంది శిక్షణ పొందారు. అయితే, 2011 లో ఏఐఏడీఎంకే ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కోర్సు మూసివేసింది.
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
చరిత్రలో ఈరోజు : ఉపహార్ అగ్నిప్రమాదంలో 59 మంది మృతి
యూపీ విభజన : యోగీ ఢిల్లీ పర్యటన అందుకేనా..?
కరోనా స్పెషల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
హార్ట్ రిథమ్ : కరోనా కారణంగా అరిథ్మియాకు అవకాశాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..