Jagapathi Babu | మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయవాడలో అభిమానుల సందడి మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘పెద్ది’ చిత్రంలో అప్పలసూరి అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఆయన, సినిమా విజయంపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఒక సినిమా విజయంగా కాకుండా, మొత్తం తెలుగు సినీ పరిశ్రమకు ఈ చిత్రం కొత్త ఊపిరి పోస్తుందని అన్నారు.
పెద్ది సినిమా ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఒక పెద్ద దిక్కు అవుతుంది అంటూ జగపతి బాబు వ్యాఖ్యానించారు. ఇటీవల సంక్రాంతి సీజన్ తర్వాత ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాలు లేకపోవడంతో థియేటర్ రంగం కొంత ఒత్తిడిని ఎదుర్కొంటోందని, అలాంటి సమయంలో ‘పెద్ది’లాంటి భారీ చిత్రం బాక్సాఫీస్కు కొత్త జోష్ తీసుకురావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని, ప్రేక్షకులు ఒక మంచి థియేట్రికల్ అనుభవం కోసం ఎదురుచూస్తున్నారని జగపతి బాబు తెలిపారు. బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ఎంతో ఎమోషన్, ఇంటెన్సిటీతో తెరకెక్కించారని, రామ్ చరణ్ కెరీర్లో ఇది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘పెద్ది’లో రామ్ చరణ్ సరికొత్త మాస్ అవతార్లో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యం, క్రీడా అంశాలు, బలమైన భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్కు లభించిన స్పందన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.