Advanced Childbirth | న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రపంచవ్యాప్తంగా 2020లో అత్యధిక ముందస్తు జననాలు (3.02 మిలియన్లు) భారత్లోనే సంభవించినట్టు లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. మొత్తం ముందస్తు జననాల్లో 20 శాతం భారత్లోనే జరిగాయని పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, నైజీరియా, చైనా, ఇథియోపియా, బంగ్లాదేశ్, కాంగో, అమెరికా నిలిచాయి. ఈ 8 దేశాల్లోనే మొత్తం 50 శాతం జననాలు జరిగాయి. పేద, మధ్య ఆదాయ దేశాలతో పాటు గ్రీస్, అమెరికా వంటి సంపన్న దేశాల్లోనూ ముందస్తు జననాల రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా 13.4 మిలియన్ల శిశువులు నెలలు నిండకుండానే పుట్టారని అధ్యయనం అంచనా వేసింది. 2010-2020 మధ్య ఈ తరహా జననాల ప్రపంచ వార్షిక రేటు కేవలం 0.14 శాతం మాత్రమే తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ విధంగా జన్మించిన చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అధ్యయనం పిలుపునిచ్చింది. అలాగే గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పోషకాహారం పైనా దృష్టి సారించాలని సూచించింది. ‘నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం’ అని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ ఆఫ్ మెటర్నల్ అన్షు బెనర్జీ తెలిపారు.