న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెండ్లి కాకుండానే గర్భం దాల్చిందన్న కారణంతో 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, అన్న సజీవ దహనం చేశారు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగినపుడు బాధితురాలు సమాధానం చెప్పకపోవడంతో ఆమెను గురువారం అడవిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఆమె పెద్ద ఎత్తున అరవడంతో సమీపంలోని రైతులు ఆమెను దవాఖానకు తరలించారని పేర్కొన్నారు. ఆమె శరీరం 70 శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.