బెంగళూరు/తుముకూరు, నవంబర్ 4: ‘కమీషన్ రాజ్’గా ముద్రపడిన కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ‘కంగాల్రాజ్’గానూ మారిపోయింది. ప్రభుత్వ అసమర్థ పాలన, దీనికితోడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. జన్మించిన ఇద్దరు పసికందులు కూడా మరణించారు. ప్రభుత్వ హత్యగా భావిస్తున్న ఈ ఘటన తుముకూరులో చోటుచేసుకున్నది. ఓ గర్భిణికి బుధవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో చుట్టుపక్కలవాళ్లు ఆమెను తుముకూరు జిల్లా దవాఖానకు తీసుకెళ్లారు. డ్యూటీలో ఉన్న డాక్టరు, నర్సులు ఆధార్కార్డు, హెల్త్కార్డు అడిగారు. ఆ సమయంలో ఆమె వద్ద ఈ రెండూ లేవు. దీంతో చికిత్స నిరాకరించారు. ఏం చెయ్యాలో అర్థం కాక సదరు గర్భిణి తిరిగి ఇంటికి వెళ్లింది.
అయితే గురువారం తెల్లవారుజామున కవలలకు జన్మనిచ్చింది. ఈ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె మరణించింది. ఇదే సమయంలో కవల పిల్లలు కూడా మరణించారు. విషయం తెలిసిన చుట్టుపక్కలవాళ్లు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తల్లీబిడ్డలు మరణించారని విమర్శించారు. మరణించిన మహిళకు ఆరేండ్ల కూతురు ఉన్నదని, ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి ఏంటని నిలదీశారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో వైద్యారోగ్య శాఖ మంత్రి సుధాకర్ స్పందించారు. ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఓ డాక్టర్, ముగ్గురు నర్సులను సస్పెండ్ చేశారు. అనాథగా మారిన ఆరేండ్ల బాలికకు ఉచిత విద్య, వసతి కల్పిస్తామని ప్రకటించారు. ఇంకోవైపు కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ తల్లీబిడ్డల మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, మంత్రి సుధాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.