Madhya Pradesh | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh)లో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆడపిల్లలకు పెండ్లి చేసే ఓ పథకం (marriage scheme) వివాదాస్పదమైంది. సామూహిక వివాహాలకు ముందు నూతన వధువులకు గర్భస్థ పరీక్షలు చేయడం కలకలం రేపింది. బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పెండ్లి కావాల్సిన ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ (Pregnancy test) చేయడం వారిని తీవ్రంగా అవమానించడమే అవుతుందని ధ్వజమెత్తారు.
పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆడపిల్లల కోసం మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన’ (Mukhya Mantri Kanya Vivah Yojana) పథకాన్ని అమలు చేస్తోంది. నిరుపేద యువతులు దరఖాస్తు చేసుకుంటే ఈ స్కీం కింద అందరికీ ఒకేసారి సామూహిక వివాహాలు జరిపిస్తారు. పెండ్లి సమయంలో ప్రభుత్వం నుంచి రూ.56వేలు ఆర్థిక సాయం కూడా అందిస్తారు. కాగా, ఈ స్కీం కింద దిండోరి (Dindori) జిల్లా గడసరాయ్ ( Gadasarai ) ప్రాంతానికి చెందిన 219 యువతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఈ నెల 22న (శనివారం) వివాహం జరిపించాల్సి ఉంది. దీంతో దరఖాస్తు చేసుకున్న వారి వద్ద వివరాలు తీసుకోవడంతోపాటు వారందరికీ అధికారులు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇంత వరకూ బాగానే ఉన్నా.. వైద్య పరీక్షల్లో భాగంగా యువతులకు గర్భనిర్ధారణ పరీక్షలు (Pregnancy
test) చేయడం వివాదానికి దారి తీసింది. వైద్య పరీక్షల్లో నలుగురు యువతులు గర్భవతులని తేలడంతో
వారిని వివాహానికి అనుమతించలేదు. దీంతో పెండ్లికి ముందే వధువులకు గర్భస్థ పరీక్షలు చేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ప్రభుత్వం తీరుపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్కీం పేరుతో ఇలా యువతులను అవమానించేలా ప్రెగ్నెన్సీ టెస్టులు ఎప్పటి నుంచి చేస్తోందో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ అంశంపై కాంగ్రెస్ (Congress) తీవ్రస్థాయిలో మండిపడింది. పేదింటి అమ్మాయిలను కించపరిచేందుకే ఇలాంటి పరీక్షలను ప్రభుత్వం చేపట్టిందని విమర్శించింది. ‘ఏ నిబంధన ప్రకారం ఆ యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇది పేదలను అవమానిండచడమే. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి’ అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
మరోవైపు ఈ వ్యవహారంకాస్తా స్థానికంగా చర్చనీయాంశం కావడంతో అధికారులు తమ తప్పును
కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. దిండోరి సీఎంహెచ్వో (Chief Medical and Health Officer) డాక్టర్ రమేశ్ మారావి (Ramesh Maravi) మాట్లాడుతూ.. సామూహిక కార్యక్రమంలో పెండ్లి చేసుకునే యువతులకు ఏజ్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్, సికిల్ సెల్ (రక్తహీనత) పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాలు ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే వారికి టెస్టులు మాత్రమే చేశామని చెప్పారు. అయితే, సికిల్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కొందరు యువతులు.. తమకు పీరియడ్ సంబంధిత సమస్యలు ఉన్నాయని వెల్లడించినట్లు చెప్పారు. దీంతో వారికి ప్రెగ్నెన్సీ టెస్ట్లు చేయగా.. నలుగురికి పాజిటివ్ (Positive) గా తేలిందని ఆయన వివరించారు. తాము కేవలం టెస్టులు చేస్తామని, జాబితాలో నుంచి తొలగించే నిర్ణయం ఆరోగ్య శాఖ నివేదికల ఆధారంగా సామాజిక న్యాయ శాఖ విభాగం తీసుకుంటుందని చెప్పారు.
Also Read..
Sudan Crisis | సుడాన్ అల్లర్లలో 400 మంది మృతి.. ప్రమాదంలో చిన్నారుల జీవితం
Supreme Court | సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. ఆంక్షలు అమలు
India Corona Virus | కాస్త తగ్గిన రోజూవారీ కొవిడ్ కేసులు.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు