Sudan Crisis | ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య గత తొమ్మిది రోజులుగా తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు మొత్తం 420 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) తాజాగా వెల్లడించింది. మరో 3,700 మంది గాయపడినట్లు తెలిపింది. కాగా, ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు యూనిసెఫ్ (UNICEF) ఆందోళన వ్యక్తం చేసింది.
డబ్ల్యూహెచ్వో ప్రతినిధి (WHO spokesperson) మార్గరేట్ హ్యారిస్ (Margaret Harris) మీడియాతో మాట్లాడుతూ.. ‘సుడాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 420 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. 3,700 మంది గాయపడ్డారు. ఇక్కడి ఆరోగ్య కేంద్రాలపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 20 ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి’ అని తెలిపారు.
సుడాన్ ప్రపంచంలోనే పిల్లల్లో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ (UNICEF) ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితులతో యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. ఈ అంశంపై యూనిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ (JAMES ELDER) మాట్లాడుతూ.. ఈ అల్లర్లలో పిల్లలే ఎక్కువగా బాధితులైనట్లు వెల్లడించారు. ‘ ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. ప్రపంచంలోనే పోషకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న సుడాన్లో.. ప్రస్తుత పరిస్థితులతో 50 వేలకుపైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడింది’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు పేలుళ్లతో నగరాలు దద్దరిల్లుతుండటంతో వేలాదిమంది సుడానీలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారని జేమ్స్ ఎల్డర్ తెలిపారు. కొందరు బాంబు పేలుళ్లు, కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ఇండ్లలోనే తలదాచుకుంటున్నారన్నారు. ప్రజలు ఆహారం, మంచి నీళ్లు, మందులు, కరెంట్ లేక నానా అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, సుడాన్ ఘర్షణల్లో చిక్కుకున్న తమ వారిని రక్షించుకునేందుకు పలు దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఘర్షణల నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన సౌదీ అరేబియా నావికాదళ ఆపరేషన్ ద్వారా దౌత్యవేత్తలు, ఇతర అధికారులు సహా 150 మందికిపైగా పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించింది. సుడాన్ నుంచి తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చిన తొలి దేశం ఇదే. అలాగే, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాలు కూడా తమ పౌరులను సుడాన్ నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టాయి.
భారత్ కూడా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించడానికి అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. సుడాన్పై పట్టుకోసం ఆర్మీ, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య భీకర పోరు నేపథ్యంలో ఆ దేశంలో విమానాశ్రయాలన్నింటినీ మూసేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల ద్వారా అక్కడ చిక్కుకున్న వారు స్వదేశానికి వచ్చే అవకాశం లేకపోవడంతో రోడ్డు మార్గం గుండా వారిని అక్కడి నుంచి తరలించాలని యోచిస్తోంది. తొలుత ఆ దేశంలోనే సురక్షిత ప్రాంతాలకు రోడ్డు మార్గం ద్వారా తరలించి, అక్కడి నుంచి ఆ దేశ సరిహద్దున ఉన్న దేశాల ద్వారా భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
‘సూడాన్ బాధితులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన వివిధ మార్గాలను పరిశీలించాం. ఇందులో భాగంగా జెడ్డా ఎయిర్పోర్టులో రెండు ఎయిర్ ఫోర్స్ సీ-130 విమానాలను, సూడాన్ పోర్టులో ఐఎన్ఎస్ సుమేధా ఓడను సిద్ధంగా ఉంచాం’ అని భారత ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే, బాధితుల తరలింపు ప్రక్రియలో భాగంగా 150 మంది పౌరులు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. వీరిలో సౌదీ అరేబియన్లే కాక 12 దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని, వీరు సౌదీ అరేబియా ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు.
2021 అక్టోబర్లో సైనిక తిరుగుబాటుతో సుడాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలింది. ఈ సైనిక తిరుగుబాటులో సైన్యంతోపాటు పారామిలిటరీ కూడా పాల్గొంది. అయితే, ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం పారామిలిటరీ గ్రూప్ ‘శీఘ్ర మద్దతు దళం’ (ఆర్ఎస్ఎఫ్)తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో ఖార్తూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు.యుద్ధవిమానాలు, మెషిన్ గన్లు అమర్చిన ట్రక్కులు సహా సాయుధ వాహనాలతో జనసమ్మర్ద ప్రాంతాలపై కాల్పులు జరుపుతుండడంతో సుడాన్లో ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.
Also Read..
India Corona Virus | కాస్త తగ్గిన రోజూవారీ కొవిడ్ కేసులు.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు
Supreme Court | సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. ఆంక్షలు అమలు
American Airlines | విమానం గాల్లో ఉండగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం