న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలు వీలైనంత త్వరగా దేశ ప్రజలందరూ తీసుకునేలా దేవుడిని ప్రార్థించాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వల్ల గత ఏడాది నుంచి సుప్రీంకోర్టులో భౌతికంగా కేసు విచారణలు జరగడం లేదు. గత మార్చి నుంచి అత్యున్నత న్యాయస్థానం కేసులన్నింటినీ వర్చువల్గా విచారిస్తున్నది. అయితే ఇవాళ ఓ కేసులో పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు మళ్లీ సుప్రీంలో విచారణకు వచ్చే సమయానికి .. భౌతిక విచారణ జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన అన్నారు. అప్పుడు జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. కోవిడ్ టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, అప్పుడే మనం ఫిజికల్గా విచారణలు చేపట్టే వీలు అవుతుందని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ కీలకమైన ప్రక్రియ అని జస్టిస్ చంద్రచూడ్ మరోసారి తన మాటల్లో వ్యక్తం చేశారు. కరోనా ఆంక్షల వల్ల కీలకమైన కేసులను కేవలం వర్చువల్ రీతిలోనే సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. సోమవారం కూడా ఓ సుమోటో కేసులో జస్టిస్ చంద్రచూడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్లను కేంద్రం వేరువేరు ధరలకు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. వ్యాక్సిన్ విధానానికి సంబంధించిన డాక్యుమెంట్ను ఇవ్వాలని జస్టిస్ చంద్రచూడ్ కేంద్రాన్ని ఆదేశించారు.