న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) నూతన డైరెక్టర్గా 1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ను నియమించారు. ప్రవీణ్ సూద్ రెండేళ్లపాటు సీబీఐ డైరెక్టర్గా కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా సీబీఐ డైరెక్టర్గా పనిచేస్తున్న సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీకాలం ముగియనుండటంతో సీబీఐ నూతన డైరెక్టర్గా సూద్ను నియమించారు. జైస్వాల్ పదవీ విరమణ చేయగానే సూద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ పలువురి పేర్లను పరిశీలించి సీబీఐ కొత్త బాస్ పదవి కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సెలెక్ట్ చేసింది. వారిలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్య ప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, మరో సీనియర్ ఐపీఎస్ అధికారి తాజ్ హాసన్ ఉన్నారు. వారి నుంచి కర్ణాటక క్యాడర్కు చెందిన ప్రవీణ్ సూద్ను సీబీఐ కొత్త డైరెక్టర్గా ఖరారు చేశారు. సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఉన్నారు.
కాగా, సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపికైనవారి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. అయితే ఆ పదవీకాలన్ని గరిష్టంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కమిటీ సమావేశంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, లోక్పాల్ సభ్యుడి నియామకానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్గా ఉన్న జైశ్వాల్.. 1985 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మహారాష్ట్ర క్యాడర్ అధికారి. గతంలో ఆయన ముంబై పోలీస్ కమిషనర్గా పనిచేశారు. 2021 మే 26న సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు.