Prateek Yadav : యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తనయుడు ప్రతీక్ యాదవ్ (38) అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం లక్నోలో అపస్మారక స్థితిలో ఉన్న ప్రతీక్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడైంది.
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ హాస్పిటల్ డాక్లర్లు వెల్లడించిన నివేదిక ప్రకారం.. ప్రతీక్ మరణంలో అనుమానాస్పదమైన అంశాలేమీ లేవు. శరీరం కింది భాగం నుంచి పై భాగానికి రక్తం ప్రవహించకుండా గడ్డకట్టింది. దీంతో ఊపిరితిత్తులు, గుండె ధమనులపై ఒత్తిడి పెరిగి, ఇది కార్డియాక్ అరెస్ట్కు దారి తీసింది. దీంతో ప్రతీక్ మరణించారు. పూర్తిస్థాయి రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్ బీజేపీ నేతగా రాజకీయాల్లో ఉన్నారు. 2011లో వీరి వివాహం జరగగా, ఇటీవల భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. భార్య ప్రవర్తనపై ప్రతీక్ యాదవ్ విమర్శలు కూడా చేశారు. త్వరలోనే తన నుంచి విడాకులు తీసుకుంటానని ఆయన గత జనవరిలో సోషల్ మీడియాలో వెల్లడించారు.
ప్రతీక్ మృతదేహం వద్ద ఆయన భార్య అపర్ణా యాదవ్ కనిపించలేదు. గతంలో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ప్రతీక్ మరణంపై ఆయన సోదరుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. రెండు నెలల క్రితం తనను కలిశానని, అప్పుడు అనేక అంశాలపై చర్చించుకున్నామని అఖిలేష్ తెలిపారు.