Prashanth Kishore | ఓ వైపు కరోనా… మరో వైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు… ఇంకో వైపు ఈసీ కసరత్తు… ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ ఉపాయాన్ని సూచించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేస్తేనే తాము ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ఓ నిబంధన విధించాలని సూచించారు. కరోనా వ్యాప్తి కాకుండా ఇదొక్కటే అత్యుత్తమ మార్గమని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు.
‘ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేస్తేనే తాము ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ కరాఖండిగా చెప్పేయాలి. కరోనా వ్యాప్తి కాకుండా ఇదొక్కటే అత్యుత్తమ మార్గం. కోవిడ్ సమయంలో ఎన్నికలకు వెళ్లాలంటే ఇదొక్కటే పరిష్కారం. మిగితాదంతా చెత్త వ్యవహారమే. కోవిడ్ నిబంధనలను ఎవ్వరూ పాటించరు’ అని ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఓ వైపు కరోనా విజృంభణ… మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ఇప్పటికే రెండు మార్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కేంద్ర ఎన్నికల కమిషన్తో భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్, స్థానిక పరిస్థితులను ఈసీకి నివేదించారు. ఇక.. ఇది ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించే సమయం ఎంత మాత్రమూ కాదని కోవిడ్ టాస్క్ఫోర్స్ చైర్మన్ వీకే పాల్ ఈసీకి తెగేసి చెప్పిన విషయం తెలిసిందే.