తనకూ, రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి మనస్పర్ధలూ లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. రాహుల్ చాలా పెద్ద నాయకుడని, తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడినని పీకే పేర్కొన్నారు. అంత పెద్ద నేపథ్యమున్న వ్యక్తితో తనకు ఏం ఇబ్బందులుంటాయి? అని సూటిగా ప్రశ్నించారు.
బిహార్ నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు పీకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత పీకే ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తనను పిలిచారని, ఇద్దరమూ మాట్లాడుకున్నామని ఆయన వెల్లడించారు. ఒకవేళ ఆయన ఫోన్ చేయకుంటే, నాతో మాట్లాడకుంటే… నేను కూడా ఆయనతో మాట్లాడే వాడినే కాదు. విశ్వాసం అనేది ఇద్దరి మధ్యా ఉండాల్సిన అంశం. అని పీకే అన్నారు.
కాంగ్రెస్ పునరుత్థానం కోసం సలహాలు కావాలంటూ పార్టీ తనను పిలిచిందని, అందుకే తాను వెళ్లి, సూచనలు చేశానని పేర్కొన్నారు. అయితే.. తన సలహాలను పాటించాలన్న గ్యారెంటీ ఏమీ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు తన అవసరం లేదని, పార్టీలోనే చాలా మంది సీనియర్లు ఉన్నారని పునరుద్ఘాటించారు.