పీకే సుముఖత!
2024 ఎన్నికల వ్యూహంపై ప్రజెంటేషన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించింది. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 పార్లమెంటు ఎన్నికలు, ఈ ఏడాది జరుగనున్న పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ అగ్రనేతలకు ప్రశాంత్ కిశోర్ శనివారం ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ, చాలా తక్కువ సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహం ఎలా ఉండాలన్న దానిపై పీకే నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
పార్టీ బలంగా ఉన్న రాష్ర్టాల్లో ఎన్నికల్లో గెలిచేందుకు మరింత కృషి చేయాలని, 365 నుంచి 370 ఎంపీ స్థానాలపై గురిపెట్టి, మిగిలిన చోట్ల ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్టు తెలుస్తున్నది. పార్టీ సమాచార విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కిశోర్ సూచించినట్టు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. కాగా, ఏమీ ఆశించకుండానే తాను పార్టీలో చేరుతానని, కాకపోతే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తాను ఇచ్చిన సలహాలు పాటించాలని పీకే పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.